అలందా మీడియా కేసులో గత కొన్ని రోజులుగా అజ్ణాత వాసంలో ఉన్న గరుడ పురాణం శివాజీని ఎట్టకేలకు పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అరెస్ట్ చేశారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి సైబరాబాద్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్స్ ఆఫీస్కు తరలించారు.
అలంద మీడియాను ఇబ్బంది పెట్టే విధంగా టీవీ9 షేర్లను తన పేరు మీదికి బదలాయించుకుని ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారనేది శివాజీపై ప్రధాన ఆరోపణ. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి టీవీ9కు చెందిన షేర్లను రవిప్రకాశ్ నుంచి శివాజీ కొనుగోలు చేసినట్టుగా అలంద మీడియా ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానె రెండు నెలల క్రితమే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అప్పటి నుంచి విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
శివాజీ శంషాబాద్ నుంచి అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ గతంలోనే శివాజీపై లుకౌట్ నోటీసులు జారీచేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసు అధికారులు చెప్పారు .దీంతో శివాజీని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.