డీఎంకే అధినేత కరుణానిధి (94) మృతి చెందారు. అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వయో భారం కారణంగా కరుణానిధి అవయవాలు చికిత్సకు స్పందించలేదని డాక్టర్లు తెలిపిన విషయం తెలిసిందే.
ఆయన ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు.
ఆయన ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండు రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. కరుణ కిడ్నీ, లివర్కు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. వయోభారం కారణంగా చికిత్సకు శరీరం సహకరించడం లేదన్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసినప్పటి నుంచే కార్యకర్తలు తరలి వచ్చారు.