ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఎంతో కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన ఆయన, కన్నుమూశారని కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేశారు.
ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో1942, జనవరి 8న జన్మించారాయన. హాకింగ్ పూర్తిపేరు స్టీఫెన్ విలియం హాకింగ్. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల్లో భౌతిక శాస్త్రాన్ని ఔపోసనపట్టిన ఆయన.. కృష్ణబిలాల(కాలబిలాల)పై లోతైన అధ్యయం చేశారు. ఆ క్రమంలో కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో హాకింగ్ రాసిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్’ పుస్తకం ప్రపంచంలోనే బెస్ట్సెల్లర్స్లో ఒకటిగా నిలిచింది.
గ్రహాంతర వాసులు ఉన్నారని హాకింగ్ చెప్పడం సంచలనం సృష్టించింది. వారు మనకంటే టెక్నాలజీ పరంగా ఎంతో ముందుటారని, వారితో ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ మానవ ఉనికికే ప్రమాదమని హాకింగ్ హెచ్చరించారు. వాతావరణ మార్పులు, గ్రహశకలాల ముప్పు, పెరిగిపోతున్న జనాభా కారణంగా మరో వందేళ్లలో మానవాళి ఇతర గ్రహాలకు వలస వెళ్లక తప్పదని హాకింగ్ హెచ్చరించారు.