ఈ మధ్య జ్యోతిష్కుల హడావుడి కాస్త ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే చాలు.. రకరకాల అభిప్రాయలను వెల్లడిస్తారు. నేతల తలరాతలపై జోస్యం చెప్పేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అభిప్రాయాలకు మంచి ఆదరణే ఉంటుంది. ఒకవేళ వారు చెప్పిందే.. ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయితే సదరు జ్యోతిష్కుడికి సెలెబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది.
గడచిన ఎన్నికల్లో ఆంధ్రాకి నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి అనే జ్యోతిష్కుడు. ఇప్పుడు ఆయనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూడా జోస్యం చెబుతున్నారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా మరోసారి అమ్మ జయలలిత ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఆయన నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రహ గతుల ప్రకారం చూసుకుంటూ అమ్మ జాతకం దివ్యంగా ఉందనీ, వాటి ఆధారంగా చూసుకుంటే జయలలిత ముఖ్యమంత్రింగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పారు.
అక్కడితో ఆగకుండా 2019 నాటి ఎన్నిక గురించి కూడా ఇప్పుడే చెప్పేస్తున్నారు! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2019లో ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు..! ఇక, ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే… నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సీఎం పీఠం ఎక్కుతారని ఇప్పుడే చెప్పేశారు మరి! ఈయన చెప్పిన జోస్యం ఎంతవరకూ కరెక్ట్ అవుతుందో అనేది చూడాలంటే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాల్సిన పనిలేదు. ఎందుకంటే, తమిళనాడు రిజల్ట్స్ త్వరలోనే ఉన్నాయి కదా.