దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతోంది. ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 1,52,879 మందికి కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇప్పటివరకు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరింది.
కరోనా మరణాలు సైతం దేశంలో పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల సమయంలో 839 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,69,275కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,20,81,443 మంది కోలుకున్నారు. కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు సైతం పెరుగుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం 11,08,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. కరోనా పరీక్షలు సైతం పెంచుతున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 25,66,26,850 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. శనివారం ఒక్కరోజనే 14,12,047 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 10,15,95,147 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.