ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గాయాల బారిన పడ్డారు. రాబోయే ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో వీరిద్దరూ పాల్గొనేది వారి ఫిట్నెస్ క్లియరెన్స్పైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వీరిద్దరి లభ్యతపై కీలక విషయాలు వెల్లడించారు.
జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ గురించి కోటక్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 మధ్యలో రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో వీరి పేర్లు ఉన్నప్పటికీ, బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడం తప్పనిసరి. హార్దిక్ పాండ్యా ఇప్పటికే బెంగళూరులోని CoE కి చేరుకోగా, రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ టెస్ట్ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు ఆటగాళ్ల గురించి కోటక్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే వారికి ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చిందో లేదో నాకు ఇంకా తెలియదు కానీ వారు జట్టుతో ఉంటారని నమ్ముతున్నాను….. నాకు తెలిసినంత వరకు వారు బాగానే ఉన్నారు అయితే నిబంధనల ప్రకారం వారు ఫిట్నెస్ టెస్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అని వెల్లడించారు.
వన్డే జట్టులోని ఆటగాళ్లు సోమ, మంగళవారాల్లో ముల్లాన్పూర్లో ప్రాక్టీస్ చేస్తారని ఆ తర్వాత గురువారం ధర్మశాలకు బయలుదేరుతారని కోటక్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ను జట్టులోకి ఎంపిక చేశారు. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించలేకపోతే…..శుభ్మన్ గిల్తో కలిసి యశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది.
