సాధారణంగా తెలుగు ఎంపీలైనా, మాజీ ఎంపీలైనా కేంద్ర రాజకీయాలపై అంతగా కామెంట్ చేయరు. అధినాయకత్వాల బాటలో నడవడమే తప్ప..వీరికంటూ ప్రత్యేక అభిప్రాయాలు ఉన్నట్టుగా కనిపించవు. అధికారంలో ఉండే మాట్లాడే అవసరం ఉండదు.. అధికారం లో లేకపోతే వీళ్ల మాటలను ఎవరూ పట్టించుకోరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అడపాదడపా ఎవరో ఒకరు కామెంట్లను విసురుతూ ఉంటారు. అలాంటి కామెంట్లు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
ఇప్పుడు మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ కామెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొన్నాడు పొన్నం. ప్రధానిగా మోడీ గ్రాఫ్ పడిపోతోందని ఈయన వ్యాఖ్యానించాడు. దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నా.. వాటి ని పరిష్కరించడంలో మోడీ చొరవ చూపడం లేదని.. ఈయన విదేశీ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాడని పొన్న విమర్శలు చేశాడు. మోడీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని పొన్నం ఆరోపించాడు.
కాశ్మీర్ లో పీడీపీతో పొత్తు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై విచారణకు ఆదేశించడం వంటి వ్యవహారాలు మోడీ గ్రాఫ్ ను కిందకు పడిపోయేలా చేశాయని పొన్నం వ్యాఖ్యానించాడు. మరి ఎంతైనా కాంగ్రెస్ నేత కాబట్టి పొన్నం ఇలాగే మాట్లాడతాడని అనుకోవాలేమో.