తమ్ముళ్ల మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉందంటే… తెలుగుదేశం బలం పుంజుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి పాలన అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతో సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు! చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కూడా వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు… ఇదిగో ఇలానే ఈ మధ్య తెలుగుదేశం వర్గాలు చర్చించుకున్నాయి.
తమ్ముళ్ల మానసిక పరిస్థితి ఇలా ఉంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాత్రం ఒక ప్రశ్న తొలిచేస్తోందని తెలుస్తోంది! ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కునే పనిలోకూడా పడ్డారట. ఆ బాధ్యతల్ని ఇంటిజెన్స్ వారికే అప్పగించారని కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే… జగన్ సభలకు అంతమంది జనం ఎలా వస్తున్నారు…?
చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తుతూ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రల సందర్భంగా అనంతపురం జిల్లాలో నిర్వహించిన సభల్లో చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు జగన్. ఓ సభలో… చంద్రబాబును చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత కాస్త గొంతు సవరించుకుని చెప్పులకు బదులు చీపుళ్లు అంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని తగ్గించారనే చెప్పాలి. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. మూకుమ్మడిగా అందరూ జగన్పై పడ్డారు. అయితే, ఇదిలా ఉంటే… వైయస్ జగన్ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రలకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుండటం చంద్రబాబుకు చిక్కు ప్రశ్నగా మారిందని తెలుస్తోంది.
ఒక పక్క నుంచి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా… తెలుగుదేశంలోకి వచ్చి చేరుతున్నా జగన్ సభలకు అంతమంది జనం ఎలా వస్తున్నారో తెలుసుకోవాలన్న బాధ్యతను ఇంటిజెన్స్కు అప్పగించరాని ఓ కథనం! ఆ సభలకు జన సమీకరణ ఎలా జరిగింది, దాని వెనక కీలక పాత్ర పోషించింది ఎవరూ అనే అంశాలు తెలియాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఇదే విషయమై అధికారులతో చర్చిస్తూ… మనం ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారట! రాజధాని నిర్మాణం, అభివృద్ధి పథకాలు, ఆపరేషన్ ఆకర్ష్.. ఇన్ని జరుగుతున్నా కూడా జగన్కు అంతమంది జనం ఎందుకు వస్తున్నారో అనే ప్రశ్నపై చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. నిజంగానే… చంద్రబాబు ఎక్కడ ఏం మిస్ అవుతున్నారో తెలియడం లేదా!