ప్రస్తుతం డబ్బు ప్రభావంలేనిదే ఎన్నికలు జరగడం అసాధ్యం. ఇక ఆంధ్రాలో అయితే డబ్బులు, మద్యం ఏరులై పారింది. దేశంలోనే అత్యంత నగదు సీజ్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ మూడవ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్నివందల కోట్లు ఖర్చు చేశారో.
ఈసారి ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల నేతలు భారీగానే డబ్బులు ఖర్చు చేశారు. ఇటీ వలె టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఒక్కొక్క అభ్యర్థి రూ.25కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మొత్తం ఖర్చు పదివేల కోట్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ మన అభ్యర్థులు ఆ మొత్తంలో పాపం సగం కూడా ఖర్చు చేయలేదని లెక్కలు చూపిస్తున్నారు. దీంతో వీరు చూపిస్తున్న లెక్కలను చూసి ఈసీ అధికారులు షాక్ తిన్నారు. వందల కోట్లు ఖర్చు చేసిన సంగతి బహిరంగ రహస్యమే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగారు. ఆయన ఎన్నికల ఖర్చు కేవలం రూ. 8,39,790 ఖర్చు మాత్రమే చేసినట్టు చూపించారు. టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూ. 23,19,325 ఖర్చు చేశారు. టీడీపీ నేత సబ్బం హరి రూ. 11,18,617 ఖర్చుగా చూపించారు. వైసీపీకి చెందిన నాయకుడు గుడివాడ అమర్ రూ. 12,60,554 ఖర్చు చేశారు. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు కేవలం రూ. 2,43,711 మాత్రమే ఖర్చు చేసినట్టు చూపించారు. వీరు చూపించిన లేక్కలను చూసి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.