కత్తిమహేష్, జనసేన మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడంలేదు. తాజా పరిస్థితులు చూస్తే ఈ వివాదం మరింత ముదరనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని ఈ రోజు ఆ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై కత్తి మహేష్ సీరియస్గా స్పందించారు.
నా మీద జరిగిన దాడికి అదే ప్రెస్ నోట్ లో ఖండిస్తున్నట్లు చిన్న ముక్క రాస్తే సరిపోయేది కదా? ఎందుకింత ఇగో? నా మీద దాడి జరిగినప్పటికీ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ముందు చూపులేక మాట్లాడుతున్నారా?’ అని ప్రశ్నించారు.
తన అభిమానుల వల్ల ఒకరికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇటువంటివి చేయొద్దని చెప్పేవాడే నిజమైన హీరో అని ఆయన అన్నారు. దాడులు చేయడం అప్రజాస్వామికమైనదని ఆ లేఖలో పేర్కొంటే సరిపోయేది కదా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తనకు క్షమాపణలు చెప్పేవరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు.
జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయమని, ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ ప్రకటన చేసిందని కత్తి మహేశ్ అన్నారు. పార్టీ ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ విధి విధానాలు, మెంబర్ షిప్లు, కనీసం పార్టీ స్పోక్పర్సన్ కూడా లేవని అన్నారు.
మరో వైపు కుట్ర జరుగుతుందని అంటున్నారని, ఎవరు కుట్ర చేశారు? అని ప్రశ్నించారు. తప్పులు చేస్తూ, సమర్థతలేకుండా పార్టీని కొనసాగిస్తూ ఇతరుల కుట్ర అంటున్నారని విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ వివాదం సద్దుమనిగే అవకాశం కనిపించడంలేదు. ఇది ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.
