కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న వార్.. చినికి చినికి గాలి వానలా మారుతుంది. గత కొద్ది రోజులుగా డీడీసీఏ కుంభకోణంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రమేయం ఉందని తెలుపుతూ పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తనపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని జైట్లీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు.
దీంతో ఢిల్లీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ప్రదానీ నరేంద్రమోడీ పై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి జైట్లీని కాపాడటానికే తన సీబీఐ సోదాలు జరిపారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీడీసీఏ కుంభ కోణంలో అరుణ్ జైట్లీ కడిగిన ముత్యంలా బయటపడతారని ప్రధాని నరేంద్రమోడీ అన్న వ్యాఖ్యలపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ పేరు వింటేనే ప్రధాని నరేంద్రమోడీ రక్తం వేడెక్కి పోతుందని ఆరోపించారు.
ఈ విషయాన్ని బీజేపీ చెందిన సీనియర్ నాయకులే తెలిపారని అన్నారు. నరేంద్రమోడీ కి దమ్ముంటే అరుణ్ జైట్లీని పదవి నుంచి తప్పించిమరీ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. జైట్లీ తనపైపై పరువు నష్టం దావా వేస్తే భయపడేదిలేదని తెలిపారు. అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని కేజ్రీవాల్ హితవు పలికారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ప్రధాని మరిచిపోయారని ఆరోపించారు. అరుణ్ జైట్లీని కాపాడేందుకే సీబీఐ సోదాలను జరిపి జైట్లీకి సంబంధించిన పత్రాలను తీసుకుపోవాలని చూస్తున్నారన్నారు. ప్లాప్ రైడ్ కు పాలుపడుతున్న ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.