జల విలయంతో అల్లాడిపోయి ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న కేరళకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్రంలోని వరద బాధితులకు చేపట్టే పునరావాస కార్యక్రమాల కోసం రూ.7 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
గూగుల్ డాట్ ఆర్గ్, గూగ్లర్స్ కలిపి కేరళ వరద బాధితుల కోసం మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్టు సంస్థ ఆగ్నేయాసియా, ఇండియా ఉపాధ్యక్షుడు ఆనందన్ తెలిపారు.
జల విలయంలో అల్లాడిపోయిన కేరళలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లు వరద బాధితులకు అందిస్తున్న సహాయక కారక్రమాలు కొనసాగుతున్నాయి.
అటు ఇండియన్ బ్యాంకు కూడా కేరళ సీఎం సహాయనిధికి రూ. 4కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రూ. 3కోట్లను ఇండియన్ బ్యాంకు ఉద్యోగులు ఇవ్వగా.. బ్యాంకు రూ. కోటి కలిపి మొత్తం డబ్బును సీఎం సహాయనిధికి అందించినట్లు తెలిపింది.