దేశమంతటా కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ ఒక్క కేరళలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి. కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. మన దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం ఒక్క కేరళ నుంచే వస్తున్నాయి.
తాజాగా కేరళ లో నిన్న ఒక్కరోజే 31 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 215 మంది మరణించారు. కేరళ లో 31,445 కేసులు నమోదైనట్లు కేరళ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. మృతుల సంఖ్య 19,972కి పెరిగింది.
కేరళ లో అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 4,048 కేసులు వచ్చాయి. త్రిస్సూర్, కోళికోడ్, మలప్పురం జిల్లాల్లో మూడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కేరళలో ఆగస్టు 21న జరిగిన ఓనమ్ పండుగే దీనికి కారణమని తెలుస్తోంది. మరో వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులకు సూచించారు.
దేశంలో కరోనా మహమ్మారి గడిసిన 24 గంటల్లో 46,164 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. అలాగే నిన్న కరోనా నుంచి 34,159 మంది కోలుకోగా, 607 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,36,365కు పెరిగింది.
ఇప్పటివరకు దేశంలో 3,17,88,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3,33,725 మందికి చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 80,40,407 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్పటివరకు మొత్తం 60,38,46,475 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్రకటించారు.
Also Read : థర్డ్వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!