తిరుమల శ్రీవారి దర్శనంలో అన్యమతస్థుల డిక్లరేషన్ పై ఏపీలో వాదోప వాదాలు కొనసాగుతున్నాయి. డిక్లరేషన్ లేకుండా ఎలా అనుమతిస్తారని ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు ప్రశ్నిస్తుండగా… గతంలో ఎప్పుడూ ఇవి ఫాలో కాలేదని, ఇక మీదటా అవసరం లేదని టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.
తాజాగా ఇదే అంశంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికీ, మసీదుకు, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలకు అవసరమా అని ప్రశ్నించారు. అయినా డిక్లరేషన్ అవసరం లేదని… డిక్లరేషన్ పై సంతకం చేయకుండా శ్రీవారిని దర్శించుకుంటే అపవిత్రం అవుతుందా అన్నారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి వెళ్తే… చంద్రబాబు డిక్లరేషన్ పై ఎందుకు సంతకం చేయించలేకపోయారన్నారు.
రాష్ట్రంలో దేవాలయాలపై వరుస సంఘటనలు చూస్తుంటే టీడీపీపై అనుమానం కలుగుతుందని, హిందువులకు తామే ఛాంపియన్స్ అని చెప్పుకునేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పోటీపడుతున్నాయని విమర్శించారు.