సుమారు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ‘మగ మహారాజు’ కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ రాజ్యసభ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. ‘ప్రజారాజ్యం’ పార్టీ తరువాత అందరివాడు కొందరివాడు వాడుగా మారడంతో చేసేది లేక మూడేళ్ల కూడా పూర్తి కాకుండానే 2011 ఆగష్టులో ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దానికి ప్రతిగా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న చిరంజీవి సీఎం కుర్చీ ఆశను ఎలాగు తీర్చుకోలేక పోవడంతో పార్లమెంటులో అడుగు పెట్టాలన్న కలను స్వప్నం చేసుకున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన రాజ్యసభ సభ్యుడి హోదాలో 2012 ఏప్రిల్ 3న రాజ్యసభ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసి యూపీఏ-2 క్యాబినెట్లో పర్యాటకశాఖ మంత్రిగా కేబినెట్ హోదా సంపాదించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ సర్కార్ బొక్కబోర్లా పడి బీజేపీ ప్రభుత్వం ఏర్పడంతో చిరంజీవి పొలిటికల్ జర్నీ ప్రశ్నార్ధకంగా మారింది. విభజన ఎఫెక్ట్తో ఏపీలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగలడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండీ ఉండనట్టుగా వ్యవహరించారు మెగాస్టార్.
అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు వచ్చేసింది. ఒక వైపు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీని స్థాపించి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘జేఎఫ్ఎఫ్సీ’ ని స్థాపించి పార్టీ నాయకుల మద్దతు కూడగడుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అయితే తమ్ముడు పార్టీలోకి అన్న వెళ్లే పరిస్థితులు కూడా కనిపించడంలేదు. దీనికి పవన్ కళ్యాణ్ వైపు నుండి ప్రతికూల పవనాలు వీస్తున్నట్టుగా చర్చ నడుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి మూడు దశాబ్దాలకు పైగా మెగాస్టార్ ఉన్న చిరంజీవి.. పొలిటికల్ స్టార్గా ఎదగలేకపోయారు. పట్టుమని పదేళ్లు కూడా ప్రజాజీవితంలో ఇమడలేక ఏప్రిల్ 2న రాజకీయాలకు చిరంజీవి గుడ్ బై చెప్తున్నారనేది వార్త బలంగా వినిపిస్తోంది.