రాజధాని నడి బొడ్డున ..విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రతి దానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు… రమేశ్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…కరోనా రోగులను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి ప్రభుత్వం అనుమతినిస్తే దాన్ని కొన్ని ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పాలన బాగోలేదని విమర్శలు చేసే రమేష్ చౌదరి కరోనా పేషెంట్స్ నుంచి వేలకు వేలు లక్షలకు లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంపై కమిటీ ఎందుకు వేయలేదు బాబూ?
రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే కమిటీలు వేసే చంద్రబాబు ఆదివారం జరిగిన ప్రమాదంపై ఎందుకు కమిటీ వేయలేదని గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నిర్వహించిన జూమ్ కార్యక్రమంలో రమేష్ చౌదరి పాల్గొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారని తెలిపారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది చనిపోయారు అని ప్రాధమికంగా తేలిందన్నారు. చంద్రబాబు ఉద్దేశాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయని, ఆయనకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదని భావించి, ఆ జూమ్ యాప్ ద్వారా లేనిపోనివి ఏదో ఒకటి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు.
శిక్ష పడాలన్నదే మా ప్రభుత్వ నైజం..
ఎవరైనా గానీ తప్పు చేసినవాడికి శిక్ష పడాలన్నదే మా ప్రభుత్వ నైజమని శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ ఘటనపై కమిటీ వేయడమే కాకుండా ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలు కూడా ప్రకటించారని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చాక కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.