మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల నల్ల ధనం ఉన్నవారు ఎందరు బయట పడ్డారో ఇంత వరకూ తెలీదు కానీ అమరావతి లాంటి ప్రాంతాల్లో నష్టాలు ఎదురు అవుతున్నాయి. చేతిలో డబ్బుల్లేక విలవిలలాడుతున్న కారణంగా.. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిపై రద్దు ఎఫెక్ట్ ఓ రేంజ్లో పడినట్లు చెబుతున్నారు.
నోట్ల రద్దు కారణంగా దేశంలో చెలామణిలో ఉన్న 86 శాతం పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి వెళ్లిపోవటం.. లావాదేవీలపై పెద్ద కన్ను వేసుకున్న ప్రభుత్వ తీరు పుణ్యమా అని.. గతంలో మాదిరి తొందరపడి భారీ మొత్తాలకు లావాదేవీలు జరపలేని పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దు ముందు వరకు అమరావతిలోని కీలకమైన తుళ్లూరులో ఎకరా భూమి మూడు కోట్ల రూపాయిల వరకూ పలికేది.
అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు వరకూ ఈ ప్రాంతంలో ఎకరం రూ.8లక్షల కూడా పలికేది కాదు.ఇంత భారీగా కాకున్నా.. ఓ స్థాయిలో వెలగపూడి.. ఉండవల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ ఓ రేంజ్లో ఉండేది. అమరావతి కోర్ క్యాపిటల్ సిటీగా పేరున్న ప్రాంతాల్లో భూమి ధర భారీగా ఉండేది. అయితే.. ఎప్పుడైతే పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారో.. అప్పటి నుంచి ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు దారుణంగా పడిపోవటం గమనార్హం.