సాధారణంగా కోతులు అన్నాక ఎక్కడైనా కరుస్తాయి, రక్కుతాయి ఇది అందరికీ తెలిసిందే. దాడి చేసి మనుషులను చంపేస్తాయంటే ఎవరూ నమ్మరు…కాని ఇప్పుడు నమ్మాల్సిందే. కోతుల గుంపు కలసి రాళ్లతో దాడి చేసి వృద్ధిన్ని చంపేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.దీంతో బంధువులు కోతులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
యూపీలోని బాగ్పత్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన ధర్మపాల్ సింగ్ (72) తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. కట్టెపుల్లల కోసం ఊరికి సమీపంగా ఉన్న అటవీ ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను గమనించిన కోతుల గుంపు ఒకటి రెచ్చిపోయింది. రాళ్లతో ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ధర్మపాల్ సింగ్ రక్తసిక్తమై ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. కోతుల దాడుల కారణంగా భయంభయంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.