ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉందని పేర్కొంటూ టీడీపీ మాజీ నేత, చిలకలూరిపేట వాసి మురళీ చౌదరి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంచలన లేఖ రాశారు. ఫిబ్రవరి 2026లో మీరు అమరావతిని సందర్శించనున్నారని తెలిసిందని పేర్కొంటూ, ఆ పర్యటనకు ముందే రాష్ట్ర పరిస్థితులపై తన ఆందోళనలను తెలియజేస్తున్నానని లేఖలో తెలిపారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య ప్రమాణాలకు, రాజ్యాంగబద్ధమైన పాలనకు దూరంగా వెళ్తున్నట్లు కనిపిస్తోందని మురళీ చౌదరి ఆరోపించారు. పాలనా వ్యవస్థల్లో పారదర్శకత తగ్గుతోందని, ప్రతిపక్షాలపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని లేఖలో ప్రస్తావించారు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేస్తారా? అని బిల్ గేట్స్ను ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేముందు, అక్కడి పాలన, న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య స్థితిగతులను గమనిస్తారని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, పరిపాలనా పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా లేవన్న భావన కలుగుతోందని తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తు, యువత అవకాశాలు, పెట్టుబడుల వాతావరణం దృష్ట్యా ఈ అంశాలను బిల్ గేట్స్ గమనించాలని కోరుతూ మురళీ చౌదరి తన లేఖను ముగించారు.

