ఉత్తర భారతదేశంలో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లిన 31 మంది తెలంగాణకు చెందిన యాత్రికులు హరిద్వార్ లో చిక్కుకుపోయారు. వారిని యాత్రలకు తీసుకువెళ్లిన యాత్రాదర్శి ట్రావెల్స్ వీరందరిని హరిద్వార్ లో ఓ హొటల్ ఉంచి అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. యాత్రికుల్లో మిర్యాలగుడాకు చెందిన 15 మంది, సికింద్రాబాద్ కు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నారు.
వీరంతా యాత్రాదర్శి ట్రావెల్స్ ద్వారా యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలకు దర్శించుకునేందుకు ఈ నెల 7 వ తేదిన బయలుదేరి వెళ్లారు. వీరిలో ఒక్కోక్కరి నుంచి 30 వేల రూపాయలు వసూలు చేసిన యాత్రాదర్శి సంస్ధ మురళీ అనే ఓ యువకుడితో పాటు మరొకరిని గైడ్ గా ఇచ్చి పంపించింది. హరిద్వారా చేరుకున్న భక్తులు అక్కడే మూడు రోజుల పాటు ఉండిపోయారు.
ఇదేమిటని మురళిని ప్రశ్నిస్తే గంగోత్రిలో వాతావరణం బాగాలేదంటూ చెప్పాడని, ఆ తర్వాత అతను కూడా కనిపించకుండా పోయాడని యాత్రికులు తమ బంధువులకు ఫొన్ చేసి భోరుమన్నారు. మూడు రోజులైన డబ్బు చెల్లించకపోవడంతో హొటల్ యాజమాన్యం టిఫిన్, భోజనం వంటివి నిలిపివేసింది. యాత్రికుల్లో ఎక్కువ మంది ముసలి వారే ఉన్నారు. వారంతా బిపి, షుగర్ వంటి వ్యాదులతో బాధపడుతున్నారు.