నిన్న రాత్రి కన్ను మూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివ దేహాన్ని ప్రజల సందర్సన కోసం రాజాజీహాల్ దగ్గర ఉంచిన సంగతి తెలిసిందే. ఆమెని కడసారి చూడడం కోసం అన్నా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీగా వస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. భారీగా ప్రజలు రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను అమ్మ అభిమానులు తోసేసే ప్రయత్నం చేశారు. దీంతో కొన్ని బారికేడ్లు విరిగిపోయాయి.
కిక్కిరిసిన జనంలోంచి బయటకు వచ్చేందుకు కొందరు ప్రయత్నించారు. అందులో ఇరుక్కుపోయిన కొందరు మహిళలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పలువురు లైన్లో నిలబడలేక అక్కడ ఉన్న చెట్ల పైకి ఎక్కారు. పోలీసులు బారికేడ్లను పడిపోకుండా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడడం లేదు. జనాన్ని నియంత్రించే క్రమంలో పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని బారికేడ్లను పడేసిన ప్రజలు వాటిపై నుంచే నడుచుకుంటూ వెళుతున్నారు. విరిగిపోయిన బారికేడ్లను పోలీసులు తీసుకెళ్లి పక్కన పెట్టేస్తున్నారు. జనాలు లైన్ లో కాకుండా ఎలాపడితే అలా జయలలిత పార్థివదేహాన్ని చూసేందుకు వెళుతున్నారు.