రిపబ్లిక్ డే వేడుకలకు దేశం సిద్దమవుతున్న వేల రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రటను పోలీసులు భగ్నం చేశారు. గణతంత్ర వేడుకలే టార్గెట్గా పేలుడు పదార్థాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారీ ప్రణాళికను రచించారు. ఉగ్రవాదుల ప్లాన్ను గుర్తించిన మిలటరీ ఇంటలిజెన్స్ వర్గాలు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాయి. కుట్రకు పాల్పడిన ఇద్దరు జైషే-మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులుఅబ్దుల్ లతీఫ్, అలియాస్ దిలావర్(29), హిలాల్ అహ్మద్ భట్(26) జమ్ముకశ్మీర్లోని వకురా, బటపోరా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. గురువారం రాజ్ఘాట్ సమీపంలో కొంతమంది వ్యక్తులను కలవడానికి దిలావర్ వచ్చాడని, పక్కా సమాచారంతో అక్కడికెళ్లి అతన్ని పట్టుకున్నామని చెప్పారు.
పోలీసుల విచారణలో తాము జైషే మహమ్మద్కి చెందిన ఉగ్రవాద సంస్థలో చురుగ్గా పనిచేస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ టీమ్స్తో తాను టచ్లో ఉన్నట్టు దిలావర్ పోలీసులతో తెలిపాడు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా వారితో కమ్యూనికేట్ అవుతున్నట్టు చెస్పినట్లు సమాచారం.
ఢిల్లీలో దాడి కుట్రలో వీరిద్దరే ఉన్నారా? మిగతా నగరాల్లోనూ ఈ ఉగ్రసంస్థ దాడులకు కుట్ర పన్నిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల వేళ పేలుళ్లు జరపడం కోసం వీఐపీలు ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాల్సిందిగా దిలావర్కు మౌజ్ నుంచి ఆదేశాలు కూడా అందాయని పోలీసుుల నిర్దారించారు. వీఐపీ ప్రాంతాలతో పాటు పోష్ మార్కెట్స్, గ్యాస్ పైప్ లైన్ వంటి ప్రాంతాలను టార్గెట్ చేయాలని చెప్పినట్టు పోలీసులు గుర్తించారు.