ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఇప్పటికే అడ్రస్ గల్లంతయి పోయిన టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ ఇక బాబు బ్యాచ్తో కలిసి సాగబోమని తేల్చిచెప్పింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు.
తమ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైఖరిని కొద్ది కాలంగా గమనిస్తున్నామని ఈ నెపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశవ్యాప్తంగా మంచి విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజలు వాటి పట్ల హర్షిస్తున్నారని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో కూడా మోడీ ప్రభంజనం వీస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలన్నీ వైఫల్యం చెందిన క్రమంలో తమ వైపే ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
అందుకే తెలంగాణలో మండలస్థాయి వరకూ కమిటీలను వేసి, ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రజాసమస్యలపై పోరాడుతామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమేగాక, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు. ఈ నెపథ్యంలో గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న టీడీపీకి బైబై చెప్పి ఒంటరి పోరాటం చేయనున్నట్లు లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటికే టీడీపీ బలహీనపడిందని ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేస్తూ తాము ముందుకు సాగుతామని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాయని లక్ష్మణ్ తెలిపారు.