రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ, ఆర్థిక సంఘం చెప్పినట్టు నిరూపిస్తే తాను ఇప్పుడే సభలోనే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానానికి కౌంటరిచ్చారు.
ఏపీకి ప్రత్యేకహోదాకు సమానంగా ప్రయోజనాలు అందిస్తామంటేనే ప్యాకేజ్ కు ఒప్పుకున్నామని అన్నారు. ప్యాకేజ్ కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ఏపీ ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం? అని ప్రశ్నించిన సీఎం రమేశ్, ప్రాంతీయ పార్టీలను కూడగడతారనే చంద్రబాబును లక్ష్యం చేసుకున్నారని అన్నారు. సభలో అసత్య ప్రచారాలు చేయడం తగదని బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి తాము ఒప్పుకొన్నట్టు ఆయన గుర్తుచేశారు. యూ టర్న్ తాము తీసుకోలేదన్నారు. చంద్రబాబునాయుడును చూసి మోడీ భయపడ్డారని సీఎం రమేష్ విమర్శించారు.