ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ను కోర్టు కొట్టివేసింది. రవిప్రకాశ్ విచాణకు ఆఖరిరోజు కావడంతో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఈ రోజు కూడా పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ కు రంగంసిద్దం అయినట్లు సమాచారం.
రవిప్రకాశ్ విచారణకు రాకపోతే ఏం చేయాలన్నదానిపైనా పోలీసులు ప్లాన్–బీ కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ బుధవారం ఉదయం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. సాధారణంగా ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనే సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ను ప్రయోగిస్తారు. నిందితులు కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేయడం, బెదిరింపులకు దిగడం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే.. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. విచారణకు ఆఖరి రోజు కూడా హాజరు కాకపోవడంతో రవిప్రకాశ్ అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బుధవారం నాడు ఆయన తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది .