ఏపీలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వెల్లడించింది. అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 20 సెం.మీ. వరకు వర్షం కురిసే అవకాశం ఉందని..అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.06, ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.69, ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో రెండూ 5.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది రేపటికి దాదాపు మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు.
