అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలలో చేరుతున్నారు.దీనిలో భాగంగానే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆపార్టీ సీనియర్ నేత అల్గుబెల్లి అమరేందర్రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘దశాబ్ధకాలంగా పార్టీకి సేవ చేస్తున్నా,ఎన్నో అవమానాలను భరించాను.పిలిచి మాట్లాడే దిక్కే లేదు. పాలిటిక్స్లో ఇన్ని ట్రిక్స్ ఉంటాయా అనిపించింది. నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీకి విధివిధానాలు లేవు. ఉద్యమ సమయంలో రాత్రి, పగలు కష్టపడి కేసీఆర్తో కలిసి తెలంగాణ సాధించాం. అంత చేసినా నాకు పార్టీ న్యాయం చేయలేదు. కార్యకర్తల పరిస్థితి అదేవిధంగా ఉంది. పార్టీలో అన్యాయం, దోపిడీ జరుగుతోంది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు అమరేందర్రెడ్డి.