గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. గడచిన ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఇది మూడో పడవ ప్రమాదమని, లైసెన్స్ లేని బోట్లు ఎలా తిరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై హత్యా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
లాంచీ ప్రమాదంలో దాదాపు 40 మంది మృతి చెందారని వీటన్నింటిని సర్కారు హత్యలుగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ మేల్కోలేదని విమర్శించారు. గతేడాది నవంబరులో కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఇంటికి కొద్ది దూరంలోనే ఓ బోటు మునిగింది. అప్పట్లో 20 మందికి పైగా చనిపోయారు.
ఇక గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 21 మంది బలయ్యారని, చంద్రబాబు సినిమా షూటింగ్ కోసం చేసిన పని వల్లే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తొక్కిసలాటపై విచారణ ఏమైందో తెలియడం లేదని చెప్పారు. ఈ ఘటన విచారణ జరిగితే చంద్రబాబుది తప్పు అని తేలుతుందని అన్నారు. అందుకే విచారణ నివేదిక బయటకు రావడం లేదని చెప్పారు.
ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందా? అంటూ నిలదీశారు.
లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారు. వారు లంచాలు ఇస్తున్నారు… అందుకే ముఖ్యమంత్రి ఇటువంటి ఘటనలపై స్పందించరు. ఐదు రోజుల కిందటే ఓ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ చనిపోలేదన్నారు. మంత్రుల దగ్గరనుంచి చంద్రబాబు వరకు లంచాలు అందుతున్నాయని ఆరోపించారు.