Saturday, April 27, 2024
- Advertisement -

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ… రూ.96,550 కోట్లు ఖర్చు

- Advertisement -

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. ఏపీలో భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూ ఏపీని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు లబ్ధి చేకూర్చడంతోపాటు భవిష్యత్ తరాలకు నీటిగోస లేకుండా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో జాతీయ ప్రాజెక్టుకు పేరొందిన పోలవరం పనులు శరవేగంగా పూర్తి చేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం ఎస్పీవీలు(స్సెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేసింది.

దేశ చరిత్రలో తొలిసారి..
సాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక రాష్ట్రం ప్రభుత్వం ఎస్పీవీలు ఏర్పాటు చేయడం చాలా అరుదు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేసిన తొలి సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. వీటి నిర్మాణం కోసం ఐదేళ్లలో కనీసం రూ.96,550కోట్లు వ్యయం చేసేందుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వాటికోసం రూ. 84,092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.72,458 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది.

ప్రాజెక్టులకు ఆటంకం కలుగకుండా ఎస్పీవీ ఏర్పాటు..
రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఎస్పీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీవీ-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39,980కోట్లు ఐదేళ్ళలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ-2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి ఐదేళ్ళలో రూ.8,787కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్సీవీ-3 కింద ఏపీ రాష్ట్ర నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12,702 కోట్లు.. ఎస్పీవీ-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా-పెన్నాల అనుసంధానం కోసం రూ.7,636 కోట్లు.. ఎస్పీవీ-5 క్రింద కృష్ణా – కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3,356 కోట్లను ఐదేళ్ల కాలంలో సమీకరించనున్నారు.

కరోనా.. వరదల్లోనూ ఆగని పనులు..
ఏపీలో పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 71.46శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. గత ఆరునెలల కాలంలో 2.80 లక్షల ఘనపు మీటర్ల స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ పనులు జరిగాయి. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోదావరికీ వరదలు ఉన్నప్పటికీ పనులు ఆగకుండా స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ ప్రాజెక్టులపై పడకుండా అధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.

ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల పూర్తి..
ఏపీలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కార్ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం-2, పూల సుబ్బయ్య వెలిగొండ-హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార-నాగావళి లింక్, బీఆర్ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు చేపడుతున్నారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలని ఇటీవలే సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75లక్షల పరిహారం ఇస్తే ప్రస్తుతం రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని.. ప్రాజెక్టుల నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వం..
నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వంశధార-నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. వంశధార స్టేజ్‌-2 సంబంధించి రెండోదశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని అధికారులు ముందుకెళుతున్నారు.

వివాదాలను పరిష్కరించుకునేలా చర్చలు..
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు ఇతర రాష్ట్రాలతో ఉన్న జలవివాదాలకు పరిష్కరించేందుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈమేరకు సీఎం జగన్ వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఒడిషా తో చర్చించేందుకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కోసం 850 కోట్లు వ్యయం ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు.

ఉత్తరాంధ్రలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని చేపడుతున్న అన్ని ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఆ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -