వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల అధికార టీడీపీపై పదునైన వ్యాఖ్యలతో దూసుకుపోతున్నారు. మంగళగిరి నుంచి మంత్రి లేకేష్ పోటీ చేస్తుండటంతో …షర్మిల కూడా అదే నియోజక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఆమె పొన్నూరులో ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబుపై పవర్ పుల్ పంచ్లు విసిరారు.
పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా అని చంద్రబాబును ఎద్దేవా చేసిన షర్మిల.. పిల్లి పిల్లే.. పులి పులే అని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. మూడేళ్లలో పోలవరంలో పూర్తి చేస్తామని మాట తప్పారన్నారు. అమరావతిని అమెరికా చేస్తా, శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తా అని మాయమాటలు చెబుతున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు పౌరుషం ఉందా అని సూటిగా ప్రశ్నించారు.జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తె మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.