ప్రత్యేకహోదా నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రత్యేకహోదా సాధనకోసం లెక్టరేట్లు, జిల్లా పరిషత్ కార్యాలయాలు, మండల కార్యాలయల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేయాలన్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో నేతలు, కార్యకర్తలందరూ ఉదయం నుండి రోడ్లపైకి చేరుకున్నారు. కార్యక్రమానికి ప్రజలు, యువత, విద్యార్థులనుంచి అనూహ్యరీతిలో స్పందన వచ్చింది.
100 రోజుల పాదయాత్రను పూర్తి చేసిన జగన్ తాను విడిది చేసిన శిబిరం నుంచే ధర్నా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా సాధన కోసం గట్టిగా పోరాటం చేసి, కేంద్రం ప్రత్యేకహోదా ప్రకటించక పోతే ఏప్రిల్ 6న వైఎస్సార్సీపీ ఎంపీలంతా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ ఇప్పటికే ప్రకటించారు.
దీనిలో భాగంగానే ఈ నెల 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఒక రోజు ధర్నా కూడా చేయబోతున్నారు. 5వ తేదీ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలందరూ పాల్గొననున్నారు.
ఈలోపు ప్రత్యేకహోదాకోసం రాష్ట్రప్రజలను జాగృతం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి చేయాలని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు భారీ ఎత్తున ధర్నాలు చేశారు. ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, అసెంబ్లీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికే హోదా సాధన ప్రాధాన్యతను గుర్తించిన సాధారణ విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. వైసిపికి మద్దతుగా చాలా చోట్ల వామపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు.