టీడీపీలో తనను ఒంటరి అయిపోయానన్న భావన చంద్రబాబులో గూడుకట్టుకుందా? తనను విమర్శించినా నేతలెవ్వరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఫిలవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.
కేబినెట్లో సీనియర్ మంత్రులు ఉన్నారు. అయినా మీకు దేనికి ఎలా స్పందించాలో ఇప్పటి వరకు తెలియలేదంటే ఏమనుకోవాలి. మీరంతా వేస్ట్ అంటూ తన సీనియర్ మంత్రులపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. అమరావతిలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు సీనియర్ మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రులు అందరిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మండిపడినట్లు తెలుస్తోంది.
బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ నేతలు తనపై విమర్శలు చేస్తుంటే మీరు సమాధానం చెప్పడం లేదు.. ముఖ్యంగా సీనియర్ మంత్రులు ఎవరు గొంతు విప్పడానికి భయపడుతున్నారు. ఏమిటిదంతా మండిపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్నికలకు ఇంకా ఎంతో కాలం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రులు, పార్టీ నాయకులు దీటుగా స్పందించకపోతే కుర్చీలు కాపాడుకోవడం కష్టమని తెగేసి చెప్పినట్లు సమాచారం. మీరు మౌనంగా ఉంటే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజమవుతాయి. దాని వల్ల నష్టపోయేది పార్టీ మాత్రమే అంటూ చంద్రబాబు మంత్రులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారని, ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారు ఎవరూ పెదవి ఎందుకు విప్పడం లేదంటూ ప్రశ్నించారట.
కానీ మంత్రులు మాత్రం.. తప్పులు మీరు చేస్తూ తమని స్పందించ మంటే ఎలా సాధ్యమవుతుందని అంటున్నారట. నాలుగున్నరేళ్లు పాటు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు.. మోదీని నెత్తిన పెట్టుకున్నామని.. ఇప్పుడు ఉన్నట్టుండి విమర్శిస్తే ప్రజలు ఎలా నమ్ముతారంటూ గుసగుసలాడుకుంటున్నారట. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. ఆ ఆసహనాన్ని తమపై చూపుతున్నారని మంత్రులు తెగ మదనపడిపోతున్నారట.