సీఎం చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో రేపు ఉదయం పదకొండు గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించినట్టు సమాచారం. ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వీరితోపాటు విద్యార్థుల సంఘాలు కూడా అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన పోరాటానికి సంబంధించి సచివాలయంలో రేపు ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపై ఉన్నాయనే సంకేతాలు పంపడంతో పాటు, అంతా కలిసికట్టుగా పోరాడుతున్నామనే విషయాన్ని కేంద్రానికి తెలియజేసేందుకే ఈ అఖిల సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.