బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా పార్టీని వీడగా తాజాగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు.
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇవాళ బీజేపీ అభ్యర్థిగా ఈటల నామినేషన్ దాఖలు చేయనుండగా ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్దీప్సింగ పూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాను ఈటలకు మద్దతిచ్చేందుకే బీజేపీలో చేరానని తెలిపారు సుభాష్ రెడ్డి. నామీద ఎలాంటి మచ్చలేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు…కనీసం వారికి టికెట్ ఇచ్చేముందు నాకు మాటమాత్రమైనా చెప్పలేదు అన్నారు. అయినా ఉప్పల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేశానని ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీ సీటును తనను సంప్రదించకుండానే రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారని..ఇది కరెక్ట్ కాదన్నారు. అందుకే ఈటలను గెలిపించుకునేందుకు తనవంతు కృషిచేస్తానని తెలిపారు.