ఎన్నికల వేల రాజకీయా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటినుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా మంత్రి లోకేష్పై భాజాపా నేత విష్ణువర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళగిరి వంటి సేఫ్ స్థానం నుండి కాకుండా రాయలసీమ నుండి పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు. దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి సీమ పౌరుషాన్ని చూపలని సవాల్ విసిరారు.
బీజేపీ, వైసీపీ కలిసిపోయాయంటూ ప్రచారం చేయడం లోకేశ్ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైసీపీతో కలవాల్సిన అవసరం భాజాపాకు లేదన్నారు.ఆయన్ను కాపాడి నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. బాబు అమరావతిలో సొంత ఇల్లు కట్టుకోడుగాని…ఇతర పార్టీల నేతలు హైదరాబాద్లో ఉంటూ మాత్రం ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.
తండ్రి అండతో దొడ్డిదారిలో మంత్రి పదవిని పొందిన లోకేశ్ అదే దారిలో ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఐటీ మంత్రిగా ఉండి ఐటీ గ్రిడ్ స్కామ్ జురిగితే కనీసం దానిమీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేవలం ట్విట్టర్లో పోస్టులు పెట్టడం తప్ప మరేమీ చేయలేరని ఎద్దేవా చేశారు. ఆయన్ను ట్విట్టర్ పిట్టలదొరగా అభివర్ణించారు. ఏపీ ఎన్నికలను మొదటి దశలో నిర్వహించడం తమకు సంబంధంలేదని అది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయమన్నారు.