పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో పరకాలలో తెదేపా నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఈ సారి తెరాస నుంచి పోటీచేశారు. కాగా, కొండా సురేఖ గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు.
ఓటమిపై కొండా సురేఖ కన్నీటి పర్యంత మయ్యారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు ప్రజలు లొంగిపోయారని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం వేలాది మంది యువత రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే టీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదనీ, అలాంటివారికే ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని కొండా సురేఖ ఆరోపించారు. తాజాగా ఎన్నికల్లో విజయం నేపథ్యంలో గతంలో టీఆర్ఎస్ అరాచక పాలనకు అడ్డుగా నిలిచిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో పాటు తనను లక్ష్యంగా చేసుకోబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.