ఆయన చేతిలో అధికారం ఉంది. కానీ.. ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యమే లేదు! ఆయనకు ప్రజలు 69 వేల పైచిలుకు మెజారిటీ ఓట్లు ఇచ్చి గెలిపించారు. కానీ, ఆయనకు మెజారిటీ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ధ్యాసే లేదు! ఆయన తమకు ఏదో చేస్తారని ప్రజలు నమ్మారు. ఆయనకు ప్రజలపై నమ్మకమే లేదు! ఇక ఏం చేస్తాడు? ప్రజల సమస్యలను ఎలా తీరుస్తాడు? ఎందుకు తీరుస్తాడు? ఆయనే గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో ప్రజలు నెత్తిన పెట్టుకున్న ఎంపీ గల్లా జయదేవ్!! ఆయన ఎంపీ అయ్యాక తమకేదో ఊడబొడుస్తాడని, తమ సమస్యలు తీరుస్తాడని ప్రజలు పెట్టుకున్న ఆశలను కల్లలు చేస్తూ.. ఆయన తన వ్యాపారాలు, వ్యవహారాల అభివృద్ధిలో మునిగి తేలుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆయన వ్యాపార సంస్థలను అభివృద్ది చేసుకునేందుకు ఎంపీ ట్యాగ్ను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు తప్పితే.. నియోజకవర్గం అభివృద్ధిపై ఎంత మాత్రం దృష్టి పెట్టడం లేదు.
పైగా.. తనేదో ఏపీకి తురుపు ముక్కలా దొరికానని భావిస్తున్నాడు ఎంపీగారు! “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్“ అంటూ పార్లమెంటులో ఏపీ సమస్యలు వివరించడంతోనే తన పని ముగిసినట్టు ఆయన ఫీలైపోతున్నారు. సన్మానాలు సత్కారాలు చేయించుకుంటున్నారు. కానీ, తాను ఎంపీగా ఎన్నికైన గుంటూరుకు ఆయన ఏంచేశాడో చెప్పమంటే మాత్రం నీళ్లు నములుతున్నాడు. ఇదీ ఇప్పుడు ఎంపీ గల్లా జయదేవ్ పరిస్థితి!! రాజధాని జిల్లాగా విస్తృత గుర్తింపు పొందుతున్న గుంటూరులో ప్రజలకు ఇప్పటికీ నీటి సమస్య వెంటాడుతూనే ఉంది. రోడ్లు మౌలిక సదుపాయాలు లేనే లేవు. ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ఎంపీగారికి ఇవేమీ కనిపించవు.. ఒక్క..`అమరరాజా కంపెనీ` తప్ప!
కట్ చేస్తే.. ఇక్కడి సమస్యలు పట్టించుకుంటున్న వారు మరొకరు ఉన్నారు!? ఆయనే వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లోఎంపీగా పోటీ చేయనున్న విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు లావు కృష్ణదేవరాయులు. `డౌన్ టు ఎర్త్` అనే నినాదాన్ని నిజం చేస్తున్నారు. తాను ఎంత ఎదిగినా.. సామాన్యుల పట్ల విధేయతగా ఉంటున్నారు. వారి సమస్యలను తాను స్వయంగా తెలుసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధి కాకపోయినా.. ప్రజల కోసం శ్రమిస్తున్నారు. వారి కష్టాలను తన కష్టాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా భావి భారత పౌరులైన ఇక్కడి విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ఎంతో ఉదారతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ జయదేవ్ 2014 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన `ఇంటికో ఉద్యోగం ` హామీని సదరు ఎంపీ ఎప్పుడో బుట్టదాఖలు చేసినా.. కృష్ణదేవరాయలు మాత్రం దీనిని నిజం చేస్తున్నారు.
పక్కా విజన్తో ఉన్న లావు తన కాలేజీల్లో ఉపాధి, ఉద్యోగ మేళాల ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. దీంతో ఇక్కడి నిరుద్యోగులు ఇప్పటికే వేల సంఖ్యలో ఉపాధి పొందారు. ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.. ఎంపీగా గెలుపొందిన జయదేవ్ సామాన్యులకు అందుబాటులో కూడా ఉండడం లేదు. అసలు ఆయన గుంటూరు నుంచి ఎంపీ అంటే దాదాపు సగానికిపైగా జనాలకు తెలియదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక, పార్టీ కేడర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు కృష్ణదేవరాయలు పేరు గుంటూరు వ్యాప్తంగా మార్మోగుతోంది. తమకు ఏ కష్టమొచ్చినా చెప్పుకొనేందుకు ఇప్పుడు ప్రజలు ఆయననే ఆశ్రయిస్తున్నారు. ఇదీ.. గుంటూరు ఎంపీగా గల్లా వారి విఫల కథనం!!