ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా చంద్రబాబు మాత్రం గెలుపుపై ఆశలు చావడంలేదు. సర్వేలంటూ నానా యాగి చేస్తూ పార్టీ నేతలకు చికాకు తెప్పిస్తున్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఎన్నికల సరళిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ అధికారంలోకి రాదని తెలిసిన నాయకులు బాబు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెల్లకపోతె సమస్యలు తప్పవని బలవంతంగా సమీక్షా సమావేశాలకు వెల్తున్నారు. కొన్ని సందర్భాల్లో జిల్లా కీలక నేతల సమీక్షా సమావేశాలకు హజరుకాకుండా షాక్ ఇస్తున్నా బాబులో మాత్రం మార్పు రావడంలేదు.
గత కొద్దిరోజులుగా సమీక్షాసమావేశాలతో పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఒక వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని, నమ్మినవారే తమకు చేయిచ్చారని తమ్ముళ్లే మొత్తుకుంటున్నా బాబు మాత్రం పట్టించుకోడంలేదు. చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్నదే చెప్పేస్తున్నారని అంటున్నారు. సోమవారం జరిగిన నంద్యాల, కర్నూలు సమీక్షల సందర్భంగానూ ఇదే సీన్ రిపీట్ అయినట్లుసమాచారం.
తాను నాలుగు రకాల సర్వేలు చేయించానని అన్ని సర్వేల్లోను టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్లలో భరోసాను నింపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే కాకుండా, జాతీయస్థాయికి చెందిన పలు సంస్థలు నిర్వహించిన పలు సర్వేలలో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని స్పష్టం చేస్తున్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఒక్క మాట చెప్పి సైలెంట్గా ఉన్నారు. కాని బాబు మాత్రం వైఎస్ఆర్ సీపీ మీద విరుచుకు పడుతున్నారు. 2014 ఎన్నికల పరిస్థితులకూ, 2019 ఎన్నికల పరిస్థితులకూ చాలా తేడాలు ఉన్నాయని, ఈసారి గెలుపు వైఎస్ఆర్ సీపీదేననే చర్చ జనంలోనూ తీవ్రంగా ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఫలితాలు వచ్చేవరకు బాబు తీరులో మార్పు రాదని తెలుగు తమ్ముళ్లు గుసగసలాడుకుంటున్నారు.