పవన్ కల్యాణ్ కు ఇంత కాలానికి జ్ఞానోదయం అయినట్లుంది. అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందో జనసేనుడికి తెలిసొచ్చింది. టిడిపి-బిజెపి పెద్దలు తనను అవసరానికి వాడుకుని వదిలేశారం’టూ భోరుమన్నారు. 2014 ఎన్నికల్లో తన అవసరం తీరిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి తనను వదిలేసినట్లుగానే తాను ఫీల్ అవుతున్నట్లు చెప్పారు.
ఒకవైపేమో యావత్ రాజకీయపార్టీలన్నీ పవన్ ను ప్యాకేజీ స్టార్ గా ఆడిపోసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తన వ్యవహారశైలితో అదే నిజమన్నట్లు పవన్ కూడా వ్యవహరిస్తున్నారు. మరి, ఇంతలో చంద్రబాబుతో పవన్ కు ఎక్కడ చెడిండో అర్ధం కావటం లేదు. పైగా తనను రాజకీయాల్లో చిన్న పిల్లోడిని చూసినట్లుగా చూస్తున్నారంటూ వాపోయారు. తనపై ఐటి అధికారులను కూడా ఉసిగొల్పారట.
ప్రత్యేక హోదాపై మాట్లాడిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్లు జల్లుతున్నాయని పవన్ చెప్పారు. అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం మంచి పరిణామమని అన్నారు. 2014లో తనను వాడుకుని వదిలేశారని అనుకుంటున్నానని… 2019లో తన వైఖరి ఏంటో గుంటూరు సభలో చెబుతానని తెలిపారు. కేంద్ర మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
ఇంత చెప్పిన పవన్ వచ్చే ఎన్నికల్లో తన స్టాండ్ ఎలా ఉండబోతోందో 2019లోనే చెబుతానన్నారు. దక్షిణాది ఉద్యమం తొండ ముదిరి ఊసరవెల్లిలాగ ముదురుతోందన్నారు. 14వ తేది గుంటూరు సభలో తన కార్యాచరణ చెబుతానని అన్నారు. అన్నీ ప్రశ్నలకు అదే రోజు సమాధానం చెబుతానని పవన్ ప్రకటించారు.