వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలిచి.. టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు ఎంపీ బుట్టారెణుకు పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా ఉంది. తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేసే స్థాయి నుంచి నాకే టికెట్ కేటాయిస్తే బాగుంటుందని అనుకునే స్థాయికి వచ్చారు బుట్టా రేణుక. కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేసే అవకాశం తనకు ఇస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం కూడా పాజిటివ్గా స్పందిస్తుందని భావిస్తున్నానని సిటింగ్ ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో బుట్టాకు మళ్లీ ఎంపీ సీటు కేటాయించే పరిస్థితులపై సహజంగానే సందేహాలు ముసురుకున్నాయి. వారు పార్టీలోకి ఎంట్రీ ఇస్తే ఆ సీటు వారి కుటుంబానికే కేటాయిస్తారనన్నది వాస్తవం. దీంతో బుట్టా రేణుక ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతారని.. అది కూడా టీడీపీ అధిష్టానం దయతలిస్తే మాత్రమే అని పోలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా బుట్టా రేణుక తన మదిలో మాటను మీడియాతో పంచుకున్నారు. టికెట్టు తనకు కేటాయిస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో టీడీపీ అధినేత నుంచి స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఇక కోట్ల సూర్యప్రకాష్రెడ్డి టీడీపీలో చేరనున్నారన్న వార్తలపై తనకు ఎటువంటి సమాచారం లేదని రేణుక తెలిపారు. మరోవైపు కోట్ల ఫ్యామిలీ చేరికపై గుర్రుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కుటుంబ సభ్యులతో చంద్రబాబు చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేణుక ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కోట్ల ఎంట్రీ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.