కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. నేటితో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… లాక్ డౌన్ ను మరో వారం లేదా 10 రోజుల పాటు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది.
లాక్డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. రోజులో 20 గంటలు లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే.
జూన్ నెలలో కూడా లాక్డౌన్ అమలు చేస్తారా అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠగా మారింది. ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉంది? అనే విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తేనే మేలనే అభిప్రాయాన్ని వీరిలో ఎక్కువ మంది వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. లాక్డౌన్పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి.