చిత్తూరు జిల్లాలో టీడీపీకీ ఎదురుదెబ్బ తగలబోతోందా..? టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యంగా మంత్రి అమరనాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో ఇవి బహిర్గతమయ్యే స్థాయికి చేరాయి సుబాష్ చంద్రబోస్ వైసిపి వైపే వెళతారని ఒక వర్గం అనుమానిస్తూ ఉంది.
పలమనేరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి సుభాష్చంద్ర బోస్ ఇపుడు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొన్నటి దాకా ఆయన హవా నడిచింది. ఎపుడయితే ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి వైసిపి నుంచి ఫిరాయించి టిడిపిలో చేరి మంత్రి అయ్యారో, అప్పటినుంచి బోసు పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గం లో తన ప్రాముఖ్యం తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పసిగట్టారు. మంత్రి జరిపే హంగామా సమావేశాలనుంచి దూరం జరుగుతున్నారు.
పలమనేరులో శుక్రవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి, ఆపై జరిగిన ర్యాలీ, బహిరంగ సభకు స్థానిక నేత బోస్ డుమ్మా కోట్టి సంచలనం సృష్టించారు. ఇదే ఇపుడు రకరకాల వూహాగానాలకు కారణమయింది. టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర కార్యవర్గంలో చోటున్న తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బోస్ను కుంగి పోతున్నారు. ఇది తమనేతకు అవమానమే నంటున్నారు ఆయన అనుచరులు. ఇది పొమ్మన లేక పొగపెట్టడమే నంటున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అప్పటినుంచే బోస్కు ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో అమర్నాథరెడ్డిపై తృటిలో ఓటమిపాలైన బోస్ వచ్చే ఎన్నికల్లోనైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమర్ పార్టీ ఫిరాయించడంతో బోస్ డైలామోలో పడ్డారు.
అయితే బోస్కు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవిపోవడం మొదటి దెబ్బ. అనంతరం బోస్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో నమ్ముకున్న పార్టీ ఇలా చేసేందేమిటనే ప్రశ్న ఆయన్ను వేధించింది. ఇదంతా తనకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఉండేందుకుకే ననే అనుమానం ఆయనలో మొదలయింది. అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు.
గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి 93 వేల ఓట్లు సాధించిన బోస్కు ఇపుడు 2019లో టికెట్ ఇస్తారనే నమ్మకమే లేకుండా పోయింది. అందుకే ఆయన వర్గం కుతకుత లాడుతూ ఉంది. ఈ పార్టీలో ఉండటంకష్టమేనంటున్నారు. ఇప్పుడే కాకపోయినా తరువాతనైనా ఆయన వేరే దారి చేసుకోక తప్పదు.