తెలుగుదేశం పార్టీపై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బీజేపీ విమర్శలు తీవ్ర చేసింది. ఇన్నాళ్లు ఓపిక పడుతున్నా చంద్రబాబు నాయుడు రోజుకొక మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుండంతో ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని సోము వీర్రాజు గుర్తుచేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏ విధంగా నాలుగేళ్లుగా ప్రవర్తిస్తున్నారో చెప్పారు. గతంలో హోదా అంటే జైలుకే అని స్వయంగా చంద్రబాబే చెప్పారని.. ఇప్పుడు ఎవరూ జైలుకు వెళ్లాలో చెప్పాలని ప్రశ్నించారు. హోదాతో ఒరిగేదేమీలేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్నారని, హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3 వేల కోట్లే తేడా అని అన్న మాటలు గుర్తుచేశారు.
ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. ఉద్యమాలు చేస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న చంద్రబాబుకు ఏ చట్టం వర్తిస్తుందో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక హోదాపై బంద్కు సహకరించొద్దని చంద్రబాబు చెప్పారని కోరారు. హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని స్వయంగా చంద్రబాబే అన్నారని తెలిపారు.
బీజేపీ వల్లే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు. పోలవరం వద్దని తెలంగాణ ఎంపీలు ఆందోళన చేసినా ఏపీ టీడీపీ ఎంపీలు ఏం చేయలేకపోయారని సోమువీర్రాజు విమర్శించారు. పార్లమెంట్లో సీఎం రమేశ్, సుజనా సమన్యాయం కావాలన్నారని మండిపడ్డారు.