పవన్ కళ్యాణ్ మరోసారి సైకిల్ ఎక్కి గాజు గ్లాస్లో చంద్రబాబుతో కలిసి టీ తాగనున్నారా? ఏమో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. టీజీ వెంకటేశ్ ఆ మధ్య పొత్తుల గురించి చర్చించనున్నారని చెప్పారు. ఇప్పుడా చర్చ ముగిసినట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి పొలిటికల్ సర్కిళ్లలో ఓ హాట్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్-చంద్రబాబు రహస్యంగా భేటీ అయ్యారని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకొని ప్రజల ముందుకు రానున్నారనేది దాని సారాంశం. దీనికి సంబంధించి డీల్ కూడా కుదిరినట్టు సమాచారం.
జనసేనకు 25 ఎమ్మెల్యే , 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ – చంద్రబాబు జోడిని ప్రజలు స్వాగతీస్తారా? అనే అనుమానం ఇరువురు నేతల మదిని తొలుస్తుందట. అందుకే ప్రజల ముందుకు రావడానికి ఓ బలమైన అంశం కొసం వెతుకుతున్నారని సమాచారం. దానికి కూడా సమాధానం దొరికినట్టే అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపు సాధించగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు.ఇప్పుడు ఆ డైలాగ్నే వాడేయ్యాలని ఇద్దరు నేతలు ప్లాన్ చేస్తున్నారట. దీనికి అనుగుణంగానే హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నేతలను కేసీఆర్ బెదిరిస్తున్నారన్న కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు. తమ అనుకూల మీడియా ద్వారా ఇప్పటికే ఈ ప్రచారం ప్రారంభమైంది కూడా.
ఈ అంశాలైతే ఇప్పటివరకు ఎవ్వరూ తెర ముందుకు వచ్చి చెప్పకపోయినా పరిస్థితులు చూస్తే నమ్మేలానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబును మాటవరసకైనా విమర్శలు చేసే పవన్.. ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా ఫోకస్ అంతా వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్పైనే పెట్టింది. పవన్కు కూడా అన్ని సీట్లలో పోటీ చేసే బలం, బలగం లేకపోవడంతో ఈ పొత్తుకు అంగీకరించారేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ఇరువురి భేటీని ఏర్పాటు చేసింది లింగమనేని అని తెలుస్తుంది. ఈ లింగమనేని ఎవరో తెలుసుగా? చంద్రబాబుకు నివాసం కోసం స్థలం ఇచ్చిన వారు, పవన్ కళ్యాణ్కు కోట్ల విలువైన భూమిని కేవలం 15 లక్షలకే అందజేసిన వ్యక్తే లింగమనేని. వీరి అనుసంధాకర్త గురించి ఇప్పటికే అర్థమయ్యుంటుంది.