ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల్లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. స్థానికంగా నేతల మధ్య విభేదాలతో ఒకరివెనుక ఒకరు రాజీనామాల దారిపడుతున్నారు. దీంతో పార్టీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వర్గపోరు తారాస్ధాయికి చేరుకున్నాయి. మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా మరో మాజీ ఎంఎల్ఏ లింగారెడ్డి వర్గం మండిపడుతోంది. ఆ రెండు వర్గాలకు మధ్య గొడవలు తీవ్ర స్ధాయిలో నడుస్తోంది. అందుకనే పై రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది.
వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు సీటు కోసం వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారు. వరదరాజులరెడ్డి ఆధిపత్యానికి నిరసనగా లింగారెడ్డి వర్గానికి చెందిన 21 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఛైర్మన్ ను అడ్డుపెట్టుకుని వరతరాజులరెడ్డి అందరినీ ఇబ్బందులు పెడుతున్నట్లు కౌన్సిలర్లందరూ మండిపడుతున్నారు.
గతంలోకూడా సీఎం రమేష్ , వరదరాజులరెడ్డి మధ్య విబేధాలు భగ్గుమన్న సంగతి తెలసిందే. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వెనుక రమేష్ ఉన్నారని వారే విబేధాలు సృష్టిస్తున్నారని వరదరాజులరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఒకవైపు వరదరాజుల రెడ్డి మరోవైపు లింగారెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎవరి దారిలో వాళ్ళు చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు.
లింగారెడ్డి మొదటి నుండి టిడిపిలోనే ఉన్నారు. వరదరాజుల రెడ్డే కాంగ్రెస్ లో నుండి టిడిపిలో చేరారు. పోయిన ఎన్నికల్లో వరదరాజుల రెడ్డి కోసమే లింగారెడ్డికి చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వలేదు. అయితే వరదరాజుల రెడ్డి ఓడిపోయారు. తన ఓటమికి లింగారెడ్డే కారణమన్న కోపంతో వరదరాజులరెడ్డి కత్తికట్టారు. అప్పటినుంచి వీరి మధ్య విబేధాలు చల్లారడంలేదు. వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. మరి బాబు ఈ వర్గపోరును ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.
