సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికైయ్యారు. కేరళలోని కన్నూర్లో జరుగుతున్న 23వ అఖిల భారత మహాసభ చివరిరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. దీంతో సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభలో తొలిసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్నికైయ్యారు. ప్రకాశ్ కారత్ నుంచి ఆ బాధ్యతలు స్వీకరించారు. 2018లో హైదరాబాద్లో జరిగిన 22వ మహాసభలోనూ ఆయన రెండోసారి నియమితులయ్యారు.
ఢిల్లీ జేఎన్యూలో ఏచూరి ఎంఏ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1975లో సీపీఎంలో చేరిన ఆయన..అంచెలంచెలుగా పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. మరోవైపు ప్రధాన కార్యదర్శితోపాటు 85 మందితో కూడిన కేంద్ర కమిటీని కూడా మహాసభ ఎన్నుకుంది.వీరిలో 17 మంది కొత్త ముఖాలకు స్థానం కల్పించారు.
ఏపీ నుంచి బీవీ రాఘవులు, పుణ్యవతి, శ్రీనివాసరావు, ఎంఎ గఫూర్..తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, సీహెచ్ సీతారాములు, జి.నాగయ్య, అరుణ్కుమార్, బి. వెంకట్లకు చోటు లభించింది.17 మందితో కూడిన పొలిట్ బ్యూరోలో తెలుగురాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు ఒక్కరే ఉన్నారు.