తెలుగు రాష్ట్రాల్లో ఆర్కే రోజా పేరు తెలియని వారు ఉండరు. రాజకీయాలు, సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్గా పేరు గడించారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆర్కే రోజాకు చోటు దక్కింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నిలిచిన ఆమెకు మంత్రి పదవి వరించింది. ఐరన్ లెగ్గా తనపై ఉన్న ముద్రను చెరిపివేస్తూ ముందుకు సాగారు. పార్టీలో కీలక నేతగా ఉంటూ అందరి మన్ననలు పొందారు.
2019 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. 2019లోనే మంత్రి పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే సీఎం జగన్ ..రోజాకు ఏపీఐఐసీ ఛైర్పర్సన్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా తన టీమ్లోకి తీసుకున్నారు. 1972 తిరుపతిలో నాగరాజా రెడ్డి, లలిత దంపతులకు జన్మించారు రోజా. పద్మావతి మహిళా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1999లో టీడీపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
తర్వాత 2011లో వైసీపీలో చేరారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ అదే స్థానం నుంచి విజయఢంకా మోగించారు. 2019-21 మధ్య వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా రోజా సేవలు అందించారు. ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కడంతో ఆమె అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. నగరిలోని రోజా క్యాంప్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.