తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఈనెల 11న వెలువడనున్న ఫలితాలపైనే ఇప్పుడు అందరి చూపు పడింది. ప్రజలు ఎవరికి మెజారిటీ ఇస్తారో ఇప్పటికీ అంతు చిక్కడంలేదు. ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే…టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐ పార్టీలు ప్రజాకూటమిని ఏర్పాటు చేశాయి. అయితే హస్తం పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీ సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చి అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసినా… విజయం టీఆర్ఎస్దే మెజార్టీ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ప్రజాకూటమిదే విజయం అని చెబుతోంది. దీంతో అంతిమ ఫలితం కోసం ఫలితాలు వెలువడే 11వ తేదీ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది
తెలంగాణలో ఫలితాన్ని బట్టి టీడీపీ, కాంగ్రెస్ మైత్రీ బంధం కొనసాగుతుందా లేదా అన్నది తేలే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు పొరపాటున తారుమారు అయితే మాత్రం టీడీపీ , కాంగ్రెస్లు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి తప్పుచేశారని.. బాబుతో గనుక చేతులు కలపకపోతే కాంగ్రెస్ ను విమర్శించడానికి కేసీఆర్ వద్ద అస్త్రమేదీ ఉండేది కాదని అనేకమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్లినట్టుగా.. చంద్రబాబును కాంగ్రెస్ చంకలో పెట్టుకుందని కాంగ్రెస్ అభిమానులు వ్యాఖ్యానించారు.
అలాంటిది ఎన్నికల్లో ఓటమి పాలైతే.. బాబుపై వాళ్లు మరింతగా మండిపడే అవకాశం ఉంది. ఇక ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఏమీ తక్కువ తిన్లేదు. ఓడిపోయినప్పుడల్లా తన మిత్రపక్షాలను నిందించడం చంద్రబాబుకు అలవాటే. ఆయనకు ఇలాంటి చరిత్ర ఎంతో ఉంది.
తెలంగాణలో తన పార్టీ పోటీచేసిన పన్నెండు స్థానాల్లో ఒకటి రెండుచోట్ల మినహాయించి ఎక్కడా పరువు నిలుపుకోలేకపోతే, కూటమి చిత్తు అయితే అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ ను నిందించడం ఖాయం. కాంగ్రెస్ వల్లనే కూటమి ఓడిందని బాబు ….తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇవ్వడం ద్వారా తన రాజకీయ పబ్బాన్ని బాబు గడుపుకోనున్నారు.
తెలంగాణాలో కూటమి ఓడిపోయినా ఏపీ మాత్రం పొత్తుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని రాజకీయ విశ్లేసకులు అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ బ్రతికి బట్టకట్టాలంటే టీడీపీతో గానీ లేకా వైసీపీతోగాని జత కట్టాల్సిందే. ఇక వైసీపీ హస్తం పార్టీతో కలసి వెల్లే పరిస్థితి దాదాపు అసాధ్యం. ఇక మిగిలింది టీడీపీ మాత్రమే కాబట్టి…వేరే గత్యంతరం లేక ఆపార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే.