తొలివిడత ప్రజా సంగ్రామ పాదయాత్ర సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో విడత పాదయాత్రపై బండి సంజయ్ దృష్టిపెట్టారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనను ఎండగట్టమే తమ లక్ష్యమంటున్నారు కమలనాథులు.
ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి విడుత ప్రజా సంగ్రామయాత్ర పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రారంభం కాగా రెండో దశ పాదయాత్రకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ ఆలయాన్ని ఎంచుకున్నారు. వేసవి కాలం కావడంతో పాదయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు.
పాదయాత్రను బీజేపీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాదయాత్రతోనే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించింది. మొదటవిడత పాదయాత్రలో ప్రజలను కలసిన బండి సంజయ్.. రెండో విడత యాత్రలో ప్రజాసమస్యలపై పోరాటంలో గ్రామస్థులతో మమేకంకానున్నారు.
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర అలంపూర్ లో ప్రారంభమై గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట ,కల్వకుర్తి మీదగా మహేశ్వరం చేరుకుంటుంది. 31 రోజులపాటు పాదయాత్ర సాగనుంది. రోజుకు 13 కిలో మీటర్ల చొప్పున మొత్తం 386 కిలోమీటర్లు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఊరూరా రచ్చబండలు, నియోజకవర్గ కేంద్రాల్లో సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి జాతీయ నేతలు కేంద్ర మంత్రులు వచ్చేలా కార్యక్రమాలను రూపొందించారు.
పాదయాత్రలో ఎదురయ్యే సవాళ్లు ముందే అంచనా వేశారు బీజేపీ నేతలు. ప్రజా సంగ్రామయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తారనీ..వారు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలంటూ క్యాడర్కు బండి సంజయ్ ముందుగానే సూచించారు.
సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మరెన్ని దాడులకు ప్రయత్నించినా ప్రజా సంగ్రామయాత్రను కొనసాగించి తీరాలని నిర్ణయించారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ అరాచకాలు, అవినీతి-నియంతృత్వ-కుటుంబ పాలనను ఎండగట్టి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తమ్మీద అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ప్రజలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు.