ప్రముఖ సినీ నటుడు, స్టార్ కమెడియన్ అలీ చివరకు వైసీపీలో జాయిన్ అయ్యారు. టికెట్ విషయంలో గత కొన్నాల్లుగా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపినా ఏపార్టీ అధినేత హామీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు. మొదటి నుంచి ఎమ్మెల్యే సీటుతోపాటు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఓపెన్గా చేప్పేశారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కండువా కప్పు జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
అలీ డిసెంబర్ 28న వైఎస్ జగన్ను కలవడంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. తర్వాత మళ్లీ పెద్ద ట్విస్ట్ ఇస్తూ విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను వరుసగా కలిశారు. మొదట టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని అలీ ఆశించారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నుంచిగాని, జనసేన అధినేత నుంచిగాని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన చివరికి వైసీపీలో చేరారు.
జగన్ ఆయనకు టిక్కెట్పై హామీ ఇచ్చారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ జగన్ హామీ ఇస్తే అలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది . అలీ కోరినట్లు జగన్ టికెట్ కేటాయిస్తే వైసీపీ తరఫున అలీ.. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. టికెట్పై జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అలీకి టికెట్ విషయంపై జగన్ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా, ఛాన్స్ ఉంటే చివరి నిమిషంలో అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ టిక్కెట్ ఇవ్వ లేని పక్షంలో పార్టీ లో భవిష్యత్తులో సముచిత స్థానం ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం